NTV Telugu Site icon

Somu Veerraju Letter to CM: సీఎంకు సోము వీర్రాజు బహిరంగ లేఖ.. భద్రాద్రి రాముడి ఆస్తులు కాపాడండి..!

Somu Veerraju

Somu Veerraju

భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా నుంచి కాపాడాలంటూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. భద్రాద్రి రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పరిధిలోకి వచ్చాయి.. జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని.. ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు, భాగాలుగా ఏర్పడి మాఫియాగా మారిపోయారు. ఒక క్రైస్తవ సంస్థ ముసుగులో భూ కబ్జాకి ప్రయత్నిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఆ భూములను వాళ్ల అధీనంలోకి తెచ్చుకున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నానని లేఖలో పేర్కొన్న ఆయన.. వందల కోట్ల ఆస్తిని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగిన ముఠా.. ఎండోమెంట్ అధికారులపై కూడా దౌర్జన్యం చేసిందని ఆరోపించారు.. ఇప్పటికీ దురాక్రమణ పర్వం కొనసాగుతోంది… ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

Read Also: Rapolu Anand Bhaskar Resigns: బీజేపీకి రాపోలు రాజీనామా.. నడ్డాకు లేఖ..

కబ్జా పర్వాన్ని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకుని వస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు సోము వీర్రాజు.. రాముడు భూముల కోసం అడిగిన భక్తులను.. భూములు కావాలంటే రాముడినే రమ్మనంటూ ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయాలను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తెచ్చాను.. మంత్రి కొట్టు పట్టనట్టుగా ఉండడంతో, ఈ బహిరంగ లేఖ రాస్తున్నారు.. వెంటనే జోక్యం చేసుకుని శ్రీరాముడి ఆస్తుల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు సోము వీర్రాజు.. తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి రాముడి ఆస్తులపై పరాయి మతస్తులు కన్నుపడింది. వందల కోట్ల విలువచేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు. దాదాపు 916 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ఆ దేవుడి పొలాల్లో రాబందుల్లా వాలిపోయారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. రాముడు అంటే విశ్వాసం లేని, హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతం మారిన వ్యక్తులు రాముడిని ఎగతాళి చేస్తూ.. భగవంతుడి భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

అడిగేవారు ఎవరూ లేకపోవడం.. ధైర్యం చేసి దేవాలయ అధికారులు అడిగితే కబ్జాదారులు దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సోము వీర్రాజు.. శ్రీరాముడి భూములు కబ్జా చేస్తే మీకేంటి నష్టం..? దేవుడి ఆస్తులు కావాలనుకుంటే రాముడే స్వయంగా వచ్చి అడుగుతాడు.. మధ్యలో మీరెవరు..? అడగడానికి అంటూ హిందువుల ఆరాధ్య దైవం రాముడిని ఎగతాళి చేస్తూ దుర్భాషలాడుతున్నారని వాపోయారు.. దేవుడి భూములలో నిర్మాణాలను ఆపాలని అధికారులు వెళితే.. “రాముడు లేడు దేవుడు లేడు. తన భూములు కావాలనుకుంటే రాముడిననే వచ్చి అడగమను. మధ్యలో మీరెవరు..? మీరు ఎందుకు వచ్చారు” అంటూ ఎండోమెంట్ అధికారులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదంతా అక్కడి పాలకుల సహాయ సహకారలతోనే జరుగుతున్నదని స్పష్టంగా చెప్పవచ్చు. ఎటపాక మండలంలో 1 నుంచి 101 సర్వే నంబర్లలో దాదాపు 980 ఎకరాల శ్రీరాముడి భూములు ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం రాకముందే 1867లో పురుషోత్తముడు అనే ఓ రామ భక్తుడు ఆంగ్లేయులు దగ్గర భూములు కొన్నట్లు రికార్డులు ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పేరు మీదే పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. కబ్జా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఇది సివిల్ సబ్జెక్ట్ అని తెలివిగా తప్పించుకుంటున్నారంటే భూములను పథకం ప్రకారం కబ్జాకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పేర్కొన్న సోము వీర్రాజు.. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని చర్యలు చేపట్టి రాముడు భూములను రక్షించాలని బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.