రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీలో ఆఫీసు ఎక్కడ పెడుతుంది? కేంద్రం ఆలోచనేంటి? అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రిజర్వు బ్యాంకు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు గతేడాది అక్టోబరు 12న లేఖ రాశారు. దీనిపై ఆర్బీఐ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సందిగ్ధత ఏర్పడింది.
మూడురాజధానుల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాజధాని విషయం ప్రభుత్వం నిర్ణయించిన తర్వాతే కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ ఎంకే సుభాశ్రీ ఓ లేఖలో బదులిచ్చారు. నగదు నిల్వలు, సరఫరాకు సంబంధించిన పెట్టెల విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. ఏపీలో ప్రస్తుతం 104 కరెన్సీ పెట్టెలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశాల్లో పెట్టెల కొరతకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని సుభాశ్రీ ఆ లేఖలో వివరించారు. మొత్తం మీద ఆర్ బీ ఐ కార్యాలయం విషయంలో స్పష్టత వచ్చినట్టయింది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.