Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకు రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970గా ఉండగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సీట్ల పెరుగుదల దాదాపు ఖరారైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లు 970 అయితే ఈ మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరిగినట్లు అవుతుంది. తద్వారా పెద్ద సంఖ్యలో వైద్య నిపుణుల రూపంలో మానవవనరులను ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
Read Also: Pawan Kalyan: విద్యుత్ షాక్తో రైతుల మృతి బాధాకరం.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి
కాగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైద్య బోధనా సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తోంది. ఈ మేరకు 1254 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. 106 ప్రొఫెసర్ పోస్టులను, 312 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసి వేగంగా వీటిని భర్తీ చేసే ప్రక్రియ చేపట్టింది. అవసరమనుకుంటే ప్రైవేట్ రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వ రంగంలోనూ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే వాక్ఇన్ ఇంటర్వ్యూలాంటి పద్ధతులను వైద్య ఆరోగ్యశాఖ అవలంభిస్తోంది. దీంతో ప్రభుత్వ మెడికల్ పీజీ సీట్ల పెరుగుదలకు మార్గం సుగమమైంది.
ప్రభుత్వం చేపట్టిన చర్యల కారనంగా స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డమే కాకుండా, వైద్య రంగంలో నిపుణుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల కారణంగానే సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న మెడికల్ కాలేజీల్లో బోధనావసరాలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు పూర్తైతే, నిర్ణీత సమయానికి సుమారు మరో 3 వేల పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో జనాభాకు అవసరాలకు తగినట్లుగా, ప్రతి ప్రాంతంలో కూడా అత్యంత నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
