జనసేన పార్టీ ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. కేవలం 150 మంది సభ్యులతో తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ, నేడు 21.50 లక్షల క్రియాశీలక సభ్యత్వాలతో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూడా ప్రజలు జనసేన సిద్ధాంతాలను ఇష్టపడి పార్టీని విస్తరించమని కోరుతున్నారని ఆయన వెల్లడించారు. 12 ఏళ్లుగా పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా, ఇప్పుడు మాత్రం పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై గట్టిగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు.
తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కొన్ని భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుమ్ము, ధూళిలో నిరంతరం తిరగడం వల్ల తనకు సైనస్ సమస్య పెరిగిందని, దానివల్ల లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో అభిమానులు అత్యుత్సాహంతో లాగడం వల్ల భుజాల మధ్య కండరాలు తెగిపోయి (టియర్) తీవ్రమైన నొప్పి ఎదురైందని వివరించారు. అయితే తనకు చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉండటం వల్ల తన శరీరం ఈ నొప్పులను తట్టుకోగలిగిందని, తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజకీయాల్లో ఎదురైన ఒడిదుడుకులపై పవన్ ఘాటుగా స్పందించారు. “నేను సీఎం అయిపోవాలని పార్టీ పెట్టలేదు, సమాజంలో మార్పు తీసుకురావాలని, కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలని ఈ ప్రయాణం మొదలుపెట్టాను. నా జీవితాంతం తోడుంటామని చెప్పిన కొందరు మధ్యలోనే పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కానీ జనసైనికులు, వీరమహిళలు మాత్రం నన్ను వదలకుండా కొండంత అండగా నిలబడ్డారు. నా పార్టీ అని భుజాలపై వేసుకుని నడిపించింది ఈ సాధక్లే” అని కొనియాడారు. 2019లో తాను రెండు చోట్లా ఓడిపోయినప్పుడు వెక్కిరించిన వారికి, ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్ళినప్పుడు విమర్శించిన వారికి నేడు 21.50 లక్షల సభ్యత్వాలే సమాధానమని ఆయన పేర్కొన్నారు.
చివరగా తమిళనాడు రాజకీయ పరిణామాలపై జరుగుతున్న చర్చపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తమిళనాడులో ఒక నటుడు పార్టీ పెట్టి సీఎం అయితే, ఇక్కడ కొందరు అనవసరంగా హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన “ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి” అన్న సామెతను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని రాజకీయ పరిస్థితులు వేరని, ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు వేరని గుర్తు చేస్తూ, ఇక్కడ రాజకీయాలను అక్కడితో పోల్చడం సరికాదని హితవు పలికారు. మొత్తానికి జనసేన ఇకపై జాతీయ స్థాయిలో తన అడుగులు వేయబోతోందనే సంకేతాలను పవన్ ఈ ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు.
