బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపధ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతోందని, శ్రీహరికోట, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత మండల అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పాఠశాలలకు, కళాశాలలకు రెండురోజులు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఇక లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని, 1077 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు సహాయం కోసం 1077 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించ వచ్చునని జిల్లా కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. సోమశిల రిజర్వాయర్ కు వరద కొనసాగుతోందని,పెరుగుతున్న ఇన్ ఫ్లో కారణంగా ఔట్ ఫ్లో కూడా పెంచుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి పోకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అవసరమైతే వినియోగించుకొనేలా బోట్లను సిద్ధంగా ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.