ఏలూరు జిల్లాలోని గణపవరంలో సీఎం జగన్ ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఆయనకు ఓ లేఖ రాశారు. అందులో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడిన ఆయన.. పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. రైతురాజ్యం తెస్తానని గద్దెనెక్కి, ఇప్పుడు రైతుల్లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చారంటూ ఆరోపించారు. రైతులకి జరిగిన అన్యాయం, వ్యవసాయ రంగ సంక్షోభంతో పాటు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులపై జరిగిన దాష్టీకాలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగన్ దరిద్ర పాదం ఎఫెక్ట్తో రైతు రాజ్యం కాదు కదా.. అసలు రైతు బతికుంటే చాలు, అదే పదివేలు అనేలా దుస్థితి ఉందని లోకేష్ విమర్శించారు. ‘‘అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి, రైతుల మెడకి ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరు? మూడేళ్ల పాలనలో, కనీసం ఒక్కటంటే ఒక్క చిన్న కాలువైనా తవ్వారా? ఒక్క చిన్న సాగు నీటి ప్రాజెక్ట్ కట్టారా? రైతుల నుంచి గతేడాది కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల్ని ఇచ్చారా? అసలు ఈ ఏడాది ధాన్యం కొన్నారా? రూ. 3500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంతిచ్చారు? పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు.. అలాంటప్పుడు రైతులకి ఎందుకు ఇన్సూరెన్స్ వర్తించలేదు? రూ.12,500 రైతు భరోసా ఇస్తానని మాటిచ్చి.. కేవలం రూ.7,500 ఇస్తోందెవరు? అసలు రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులని గుర్తించారా?’’ అంటూ లోకేష్ ఆ లేఖలో ప్రశ్నించారు.
అంతేకాదు.. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మపోషకాలు లాంటివి ఏమయ్యాయని లోకేష్ నిలదీశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ రంగ వ్యతిరేక బిల్లులకు మద్దతిచ్చిన మూర్ఖుడు ఎవరని, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్ హాలిడేను మళ్ళీ తీసుకొచ్చిన అసమర్థుడెవరని అడిగారు. రైతులకు రూ.3 లక్షల వరకు సున్నావడ్డీ నిబంధనని టీడీపీ తీసుకొస్తే.. దాన్ని కేవలం రూ.1 లక్షకే పరిమితం చేసిందెవరన్నారు. ‘‘రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉండడానికి కారణం మీరు కాదా? ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్న చరిత్ర మర్చిపోయారా? సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన ఆరుగురు రైతుల్ని కాల్చి చంపించింది మీ నాన్న కాదా? రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే, టెర్రరిస్టుల్లా సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడి ఆదేశాలతో?’’ అంటూ ఆ లేఖలో నారా లోకేష్ రాసుకొచ్చారు.