సుప్రీం కోర్టు బెంచ్ పెడితే భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచడానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్లు ఏర్పాటు చేయాలని, ఆర్టికల్ 130 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయొచ్చని సూచించారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేవలం నలుగురు (9 శాతం), హైకోర్టుల్లో 81 (11 శాతం) మహిళా న్యాయమూర్తులు ఉన్నారని, ఐదు హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తులే లేరని అన్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో 6 శాతం, హైకోర్టుల్లో 3 శాతం మాత్రమే ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తులు ఉన్నారని వివరించారు. కోర్టుల్లో సామాజిక ఏకత్వం కావాలంటే, ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల ప్రాతినిధ్యం కావాలని తెలిపారు. ఆర్టికల్ 312 ప్రకారం ఆలిండియా జ్యుడీషిల్ సర్వీస్ అవసరం ఉందని, పార్లమెంట్ దీనిపై చట్టం చేయాలని కోరారు.