ఉన్నత విద్యాసంస్థలు బాలారిష్టాలను దాటడం లేదు. బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్ధులు వసతులు, సౌకర్యాల కోసం భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అధ్యాపకులు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో రెండవ రోజు కూడా ఉద్యోగులు నిరసనలు కొనసాగించారు. ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో యుజిసి కొత్త పే స్కేల్స్ ప్రకారం వేతనాలు సవరించమని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ అధ్యాపకులు శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని రెండవ రోజు కూడా కొనసాగించారు.
తమకు తక్షణమే న్యాయం చేయమని కోరుతూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు నుండి మెయిన్ గేట్ వద్ద వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేశారు. తమ బాధను వ్యక్త పరుస్తూ గత ఆరు నెలలుగా లెక్కకు మించిన వినతి పత్రాలు అందచేసినప్పటికి యూనివర్సిటీ యాజమాన్యం కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప , పరిష్కారం చూపడం లో విఫలం అవుతుంది అని తెలిపారు. కేసి రెడ్డి మొదట్లో ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించగానే రెండు నెలల్లో అందరి సమస్యలు తీరుస్తా అని హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ యేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని కాంట్రాక్టు అధ్యాపకులు తెలిపారు.
Read Also: India Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.
RGUKT అనేది దేశంలోనే ప్రత్యేక యూనివర్సిటీ అని , కానీ జీవో నెం 110 ద్వారా యూనివర్సిటీని నీరు గార్చే ప్రమాదం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ఉద్యోగులకి భరోసా కల్పించాల్సిన వ్యక్తే ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు అధ్యాపకులు. వైఎస్ ఛాన్సలర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నపటికి , అధికారులు ఈ రకంగా జాప్యం చేయడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని అధ్యాపకులు ఆందోళన చేశారు.