ఏపీలో కొత్త జిల్లాల విభజనపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని పదవులు అనుభవించిన చంద్రబాబు చేయని పనిని సీఎం జగన్ చేసి చూపించారన్నారు. ఇన్నాళ్లకు ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరిందన్నారు. ఎన్టీఆర్తో ఎలాంటి సంబంధం లేనప్పటికీ సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరులో అయినా ఆయనకు విజయవాడతో ఎక్కువ అనుబంధం ఉందని తెలిపారు. ఎన్టీఆర్ బాల్యమంతా విజయవాడలోనే గడిచిందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకు జగన్ మరింత శోభను చేకూర్చారని కొనియాడారు. ఎన్టీఆర్ తరహాలోనే మరికొన్ని జిల్లాలకు అన్నమయ్య, సత్యసాయి, అల్లూరి సీతారామరాజుల పేర్లు పెట్టడం సంతోషకరమని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.