MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?

Yarlagadda Venkata Rao

Yarlagadda Venkata Rao

MLA Yarlagadda Venkata Rao: కృష్ణా జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకాకపోవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు చిన్ని, బాలశౌరి తదితరులు పాల్గొన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ గైర్హాజరుకావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల కాంట్రాక్టులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టు పనులను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్న కేఎంవీ (KMV) సంస్థకు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆ సంస్థ వంశీకి ఆర్థిక సహాయం చేసిందని కూడా విమర్శించారు. అంతేకాకుండా, మొత్తం పనుల్లో సుమారు 80 శాతం పనులకు రూ.300 కోట్లకు పైగా కేటాయిస్తే, కేవలం 20 శాతం పనులకు రూ.206 కోట్లు కేటాయించడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కూడా కోరారు.

మరోవైపు, యార్లగడ్డ ఆరోపణలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తనకు కేఎంవీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాసిన విషయం విదితమే.. వాస్తవాలు బయటకు రావాలని కోరుతూ యార్లగడ్డ చేసిన ఆరోపణలను ఖండించారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగిన ఏటీసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యార్లగడ్డ హాజరుకాకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరు వెనుక కాంట్రాక్టుల వివాదమే కారణమా? లేక ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. అధికారికంగా యార్లగడ్డ గైర్హాజరుకు కారణాలు వెల్లడికాకపోయినా, ఇటీవల చేసిన ఆరోపణలతో ఈ ఘటనకు సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో గన్నవరం రాజకీయాల్లో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయింది..