Site icon NTV Telugu

AP Special Status: మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా.. ఈనెల 17న కీలక సమావేశం

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన అనంత‌రం పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించింది. విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యద‌ర్శి నేతృత్వంలోని ఈ క‌మిటీ స‌మావేశం నిర్వహించ‌నుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామ‌ని కేంద్రం ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జ‌రుగుతాయి.

అయితే ఏయే అంశాలను చర్చించాలన్న విష‌యంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం అందించింది. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జ‌రుపుతామ‌ని తెలిపింది. అలాగే ఆర్థికపరమైన అంశాలపై చర్చ జ‌ర‌గ‌నుంది. స‌మావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీలు వరుసగా డిమాండ్ చేస్తుండటంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ కూడా ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల ఎదుట ప్రస్తావించారు. దీంతో ముగిసిపోయిందనుకున్న ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి ఆర్థిక వ‌న‌రుల స‌ర్దుబాటు, ఏడు వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుద‌ల అంశం కూడా ఉన్నాయి. కాగా విభ‌జ‌న స‌మ‌స్యల‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.

Exit mobile version