Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన

Minister Narayana

Minister Narayana

Minister Narayana: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో గతంలో వాటిని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మిగిలిన అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు.

పవన్ కల్యాణ్‌ గైర్హాజరుపై వక్రభాష్యం వద్దు
అమరావతిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడంపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ విషయాన్ని ఎవరూ వక్రంగా అర్థం చేసుకోవద్దని సూచించారు. తానే స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌ను కార్యక్రమానికి ఆహ్వానించానని తెలిపారు. అయితే ఆపరేషన్ చేయించుకున్న కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేనని పవన్ తనకు చెప్పారని మంత్రి వివరించారు.

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం
ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం లేదని మంత్రి నారాయణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

రోజువారీ చెత్త సేకరణపై దృష్టి
ఇళ్ల నుంచి వచ్చే చెత్తను రోజుకు రోజే తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన రోడ్లు, వీధి లైట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వసతులు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం లక్షల టన్నుల లెగసీ చెత్తను పేరుకుపోయేలా చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని వివరించారు.

ఏడాదిలో 85 లక్షల టన్నుల చెత్త తొలగింపు
2024 అక్టోబర్ 2న మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. అప్పటికి రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్ లెవల్‌కు పైన సుమారు 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారని చెప్పారు. సీఎం ఆదేశాలతో ఏడాది కాలంలో ఆ 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని మంత్రి వివరించారు. 2025 అక్టోబర్ 2 నాటికి గ్రౌండ్ లెవల్‌కు పైన ఉన్న చెత్తను పూర్తిగా తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రౌండ్ లెవల్‌కు దిగువన ఉన్న చెత్తను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 150.6 లక్షల టన్నుల లెగసీ వేస్ట్
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150.6 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రి డంప్‌యార్డులోనూ లెగసీ వేస్ట్ తొలగింపు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి చెత్తను పూర్తిగా ప్రాసెస్ చేసి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు వివరించారు. చెత్త నుంచి తయారయ్యే రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ (RDF)ను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. అయితే కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు RDFను తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో లెగసీ చెత్త తొలగింపు కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన చెత్తను పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేస్తున్న విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఆధునిక సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు.