Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం

  • 25 లక్షల సభ్యత్వాలే జనసేన కొత్త లక్ష్యం
  • ఇప్పటికే 21.5 లక్షల సభ్యత్వాలు పూర్తి
  • కార్యకర్తల కుటుంబాలకు రూ.46 కోట్ల సాయం
  • స్థానిక ఎన్నికలపై నాదెండ్ల ఫోకస్
Nadendla Manohar

Nadendla Manohar

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కేవలం ఒక సంఖ్య కాదని, అది పార్టీ విలువలను, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప యజ్ఞమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జనసైనికులను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కార్యకర్తలు పడుతున్న కష్టాన్ని, పార్టీ ఇస్తున్న భరోసాను ఆయన వివరించారు.

పార్టీ సభ్యత్వ నమోదుపై నాదెండ్ల మనోహర్ కీలక గణాంకాలను వెల్లడించారు. 2024 ఎన్నికల తర్వాత జనసైనికులు ఎంతో బలంగా నిలబడి 12 లక్షల 12 వేల సభ్యత్వాలు చేశారని గుర్తు చేశారు. ఈ ఏడాది పార్టీ 25 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకోగా, క్షేత్రస్థాయిలో జనసైనికుల కృషి వల్ల ఇప్పటికే 21 లక్షల 50 వేల సభ్యత్వాలు పూర్తి కావడం విశేషమని ఆయన కొనియాడారు. ఏటా సభ్యత్వాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని చెప్పారు.

కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మనోహర్ భరోసా ఇచ్చారు. “2020లో సభ్యత్వ నమోదు ప్రారంభించినప్పటి నుండి దురదృష్టవశాత్తూ 1,034 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు. పార్టీ సభ్యత్వం ఉండి మరణించిన వారందరికీ కలిపి ఇప్పటి వరకు రూ. 46 కోట్ల 35 లక్షలను చెక్కుల రూపంలో వారి కుటుంబాలకు అందజేశాం” అని ఆయన వివరించారు. రాజకీయాల్లో కష్టాలు, సమస్యలు సహజమని, కానీ జనసేన ఎప్పుడూ తన సిద్ధాంతాలకు కట్టుబడే ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

పార్టీలో వర్గాలు లేదా భిన్న నాయకత్వాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “జనసేనలో ఎలాంటి వర్గాలు లేవు. మనందరికీ ఉన్నది పవన్ కళ్యాణ్ నాయకత్వం ఒక్కటే. నిజాలు తెలుసుకోకుండా ఎవరూ తొందరపడి మాట్లాడవద్దు” అని సూచించారు. పార్టీ కోసం వీరమహిళలు, జనసైనికులు ఎంతో ధైర్యంగా నిలబడ్డారని, వారి కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను జనసైనికులు ఒక అవకాశంగా తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మన ముందు ఉందని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడమే మన లక్ష్యం కావాలని కోరారు. ఏ రోజూ స్వార్థం కోసం పని చేయని జనసైనికుల కృషితో పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.