విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. తమకున్న 100 శాతం వాటాలను విక్రయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం వలన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్రం చెబుతున్నది. అయితే, ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఇప్పటికే ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. ఒకవైపు పార్లమెంట్లో ఈ విషయంపై చర్చించాలని పట్టుపడుతూనే, మరోవైపు ఏపీ హైకోర్టులో కేసును దాఖలు చేసింది.
Read: చిరంజీవి “లూసిఫర్” కోసం భారీ సెట్స్
దీనిపై ఈరోజు విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం విషయంలో దాఖలైన పిటీషన్పై కౌంటర్ దాఖలు చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని పిటీషనర్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. అలాంటిది ఏమీ లేదని కేంద్రం కోర్టుకు సమాధానం చెప్పింది. కౌంటర్ దాఖలుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోరింది. ఇదే ఆఖరు అవకాశం అని కోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది హైకోర్టు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదని, ప్రైవేటీకరణ జరగకుండా ఆపే బాధ్యత తమదే అని ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అటు కేంద్రం మాత్రం ఎవరు చెప్పినా వినే సమస్యలేదు అన్నట్టుగా ఇప్పటికే చెప్పేసింది. ప్రైవేటీకరణ జరగకుండా ఏపీ బీజేపీ అడ్డుకుంటుందా..? చూడాలి.