ఆన్లైన్ లోన్యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిర్వాహకులు జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. బరితెగించి మరి వేధిస్తున్నారు. లోన్ యాప్ల ద్వారా రుణాలిచ్చి, తర్వాత అధికంగా డబ్బు కట్టాలంటూ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అశ్లీల ఫొటోలు పంపి మరింత ఇబ్బందులకు గురిచేసే ఘటనలు పేట్రేగుతున్నాయి. తీసుకున్న రుణానికి ఒక్కోసారి రెండు నుంచి నాలుగు రెట్ల సొమ్మును వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల చిత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏపీలో కొండపల్లికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఇదే తరహాలో వేధింపులకు గురయ్యారు.
తాజాగా విజయవాడ జేఎన్ఎన్యుఆర్ఎం వైఎస్సార్ కాలనీకి చెందిన మరో యువతిని ఇదే తరహాలో వేధిస్తున్న ఘటన వెలుగుచూసింది. ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్న యువతి.. కుటుంబ అవసరాల నిమిత్తం 18 ఆన్లైన్ రుణ యాప్ల నుంచి అధిక వడ్డీకి రూ.55,435 రుణం తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.2,00,750 తిరిగి చెల్లించారు. ఇంకా చెల్లించాల్సింది ఉందంటూ ఆన్లైన్ లోన్ యాప్ల ఉద్యోగులు ఆ యువతిని వేధించటం ప్రారంభించారు. యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల చిత్రాలను సృష్టించి ఆమెకు పంపించారు. ఇలా ఆమె సెల్ఫోన్కు 80 వేర్వేరు వాట్సాప్ నెంబర్ల ద్వారా మార్ఫింగ్ చిత్రాలు పంపించారు. మరో 4 సెల్ఫోన్ల నుంచి వాయిస్ మెసేజ్లు పంపించి రుణం చెల్లించాలని బెదిరించారు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.