NTV Telugu Site icon

YS Jagan: రెడ్ బుక్‌ పేరుతో వేధిస్తున్నారు.. మీరు చూపిన దారిలోనే నేనూ..!

Ysrcp

Ysrcp

YS Jagan: రెడ్‌ బుక్‌ పేరుతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్‌ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గుంటూరు జిల్లా కారాగరంలో పరామర్శించారు జగన్.. ఇక, జగన్ ను చూడగానే కన్నీరు పెట్టుకున్నారట నందిగం సురేష్ .. ఆయన్ని ఓదార్చి, నేనున్నాను ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చిన జగన్‌.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. రెడ్ బుక్ రాయడం గొప్పకాదు , రెడ్ బుక్‌ పేరుతో మా నేతలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదన్న ఆయన.. కానీ, ఇప్పుడు మా నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు.. మీరు చూపించిన దారిలోనే నేను నడుస్తాను అంటూ వ్యాఖ్యానించారు..

Read Also: CM Chandrababu: అది మన దెబ్బ..! పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగాడు..

ఇక, రాబోయే రోజుల్లో ఇదే గుంటూరు జైలులో మీ నేతలు ఎంతమంది ఉంటారో చూసుకోండి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు వైఎస్ జగన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల మేనేజ్‌మెంట్‌ చేయలేక 60 మంది మృతికి కారణమయ్యాడని విమర్శించారు.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే మా నేతలపై టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి అని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని మండిపడ్డారు.. అయితే, 60 మంది మృతికి కారణమైన సీఎం చంద్రబాబు మీద కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు వైఎస్‌ జగన్..