టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు రంగం సిద్దం చేసారు. సభను తప్పు దోవ పట్టించారన్న శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు సభకు సిఫార్సు చేయనుంది ప్రివిలేజ్ కమిటీ. మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని నిర్ధారించింది ప్రివిలేజ్ కమిటీ. స్పీకరును దూషించారనే ఫిర్యాదులో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోకి తీసుకుని ప్రివిలేజ్ కమిటీ క్షమించింది అన్నారు.
ఇక ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ… అచ్చెన్న, నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్న, నిమ్మలపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇస్తాం. నోటీసులు తీసుకునే సమయంలో తాను అందుబాటులో లేనని కూన రవి చెబుతున్నారు.. అందుబాటులోనే ఉన్నారని ఫిర్యాదు దారు చెబుతున్నారు. ఆధారాలు సమర్పించమని ఇద్దరికీ చెప్పాం. ప్రివిలేజ్ కమిటీ ముందుకొచిృన ఆధారాల పరిశీలన అనంతరం కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటాం. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తనపై వచ్చి ఫిర్యాదు విషయంలో మరింత సమాచారాన్ని కోరారు.. పంపాలని ఆదేశించాం అని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూడదనేం లేదు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోయిండొచ్చు అని పేర్కొన్నారు.