తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మల్లు స్వరాజ్యం. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 13 ఏళ్ళ వయసులో పోరాటంలో పాల్గొని రజాకార్లను ఎదిరించిన ధీర వనితగా పేరుంది. 1931లో నల్లగొండ జిల్లా (ఇప్పుడు సూర్యాపేట) తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో జన్మించిన స్వరాజ్యం. రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు.
మల్లు స్వరాజ్యం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.
మల్లు స్వరాజ్యం మహిళ కమాండర్ గా కూడా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపు తో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పనిచేశారు.
మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యంకి ఒక కూతురు వున్నారు. ఆమె పేరు పాదూరి కరుణ. ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్ రెడ్డి ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డికి ఇద్దరు కుమారులు వున్నారు. వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.