Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు

Chandrababu

Chandrababu

Chandrababu on Mega DSC: డీఎస్సీ విషయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో కైకలూరు, కలిదిండి సభలో ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకుండా కొందరు కోర్టులను ఆశ్రయించారని, అనంతరం కోర్టులో ఉన్న అంశాలను పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయి ఏడాది తర్వాత వైసీపీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీలో నీట్ లీక్ జరిగితే ఇక్కడ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థుల పేరుతో అనవసర ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రోడ్లపై స్వైరవిహారం చేస్తే సహించను
అనవసర ఆందోళనలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడాన్ని ప్రభుత్వం సహించదని చంద్రబాబు స్పష్టం చేశారు. రోడ్లన్నీ కొందరు స్వైరవిహారం చేయడానికి, ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలను తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. తాను మౌనంగా ఉంటే ఎవరినీ నిద్రపోనివ్వరని, రోజూ రౌడీయిజం చేసే పరిస్థితులు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులపై క్రెడిట్ వ్యాఖ్యలు
భోగాపురం విమానాశ్రయం విషయంలోనూ రాజకీయంగా క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భోగాపురం తానే నిర్మించానని కొందరు చెప్పుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా దానిని తానే పూర్తి చేశానని చెప్పుకునే పరిస్థితి వస్తుందని, రేపు అమరావతి పూర్తయితే అది కూడా తానే నిర్మించానని చెప్పుకునే అవకాశం ఉందని విమర్శించారు.

రౌడీయిజం చేయను.. రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటా
తాను రౌడీయిజం చేయనని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే రౌడీలకు మాత్రం సింహ స్వప్నంగా ఉంటానని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకోవడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.. కాగా, డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే..