Rajahmundry Milk Tragedy: రాజమండ్రిని వణికిస్తున్న కల్తీ పాల ఉదంతంలో దర్యాప్తు వేగవంతమైంది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మరియు ఎస్పీ నరసింహ కిషోర్ కలిసి కోరుకొండ మండలం నరసాపురంలోని పాల కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
Read Also: Ather Rizta vs TVS iQube: రేంజ్, ఫీచర్లు.. బడ్జెట్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్?
వరలక్ష్మి డైరీ నుండి అడ్డాల గణేష్ అనే వ్యాపారి విక్రయించిన పాలలో, కేవలం ఒక పాల క్యాన్ మాత్రమే కల్తీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆ ఒక్క క్యాన్ పాలు తాగిన వారే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కల్తీ పాలు సేవించడం వల్ల నలుగురు మృతి చెందినట్లు ఐజీ ధ్రువీకరించారు. ఇక, ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలను పంపించామని, రిపోర్టులు వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, పరిస్థితి నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐజీ భరోసా ఇచ్చారు. అధికారులు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి పరిస్థితిని సమీక్షించారు. పాల ఉత్పత్తి నుండి పంపిణీ వరకు ఎక్కడ లోపం జరిగిందనే కోణంలో లోతైన విచారణ జరుగుతోంది.