టీడీపీ స్థాపించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1983లో కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కమ్యూనిస్టులకు రావాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ తన్నుకుపోయారని నారాయణ వెల్లడించారు. ప్రపంచంలో రాజకీయ పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన నేత ఎన్టీఆరేనని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయ నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నారు. ఇప్పడున్న నాయకులు ఏ పార్టీలో ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
మరోవైపు చంద్రబాబుపైనా సీపీఐ నేత నారాయణ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు. చంద్రబాబుతో తన స్నేహం రైలుపట్టాల వంటిది అని అభివర్ణించారు. రైలుపట్టాలు ఎప్పుడూ కలవవని.. అలాగే విడిపోవని.. అలాగే చంద్రబాబుతో తన స్నేహం కూడా అలాంటిదేనన్నారు. ఏపీ సీఎం జగన్కు, చంద్రబాబుకు అసలు పోలికే లేదన్నారు. చంద్రబాబు నాయకత్వ లక్షణాలు జగన్లో లేవన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాల్సిన అవసరం ఉందన్నారు. అటు రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం మంచిది కాదని హితవు పలికారు.