ఏపీ సినిమా టికెట్ల ధరల విషయంపై చిరంజీవి బృందంతో సీఎం జగన్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని ఆయన వెల్లడించారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా నాతో పంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పామని, సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయని ఆయన అన్నారు.
మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలని, ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంతవరకు… కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుందని ఆయన అన్నారు. ఈ పాయింట్ను కూడా చర్చించానని, నేను, చిరంజీవి ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించామని ఆయన తెలిపారు. మంచి ధరలు తీసుకురావడం జరిగిందని, ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే… అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశామన్నారు.
హీరో పారితోషకం, హీరోయిన్ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయని, ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడని ఆయన అన్నారు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలని, అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని, అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పామన్నారు.