CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాలపై చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి వర్చువల్ గా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కానున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అలాగే, రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా సమీక్షించనున్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
