Site icon NTV Telugu

CM Chandrababu: గ్లోబల్ లీడర్లుగా భారతీయులు.. త్వరలోనే రివర్స్ మైగ్రేషన్..

Cm Chandrababu Nagari

Cm Chandrababu Nagari

ప్రపంచ గమనంలో భారతీయుల పాత్ర, నాలెడ్జ్ ఎకానమీలో దేశం సాధించబోతున్న ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఐటీ రంగం నుండి గ్రీన్ ఎనర్జీ వరకు, జనాభా విధానం నుండి ఏఐ (AI) వరకు భవిష్యత్ భారత్ ఎలా ఉండబోతోందో తన విజన్‌ను పంచుకున్నారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ డిప్లొమాట్లు భారతీయులేనని చంద్రబాబు కొనియాడారు. ఎక్కడికి వెళ్లినా స్థానిక సంస్కృతులతో కలిసిపోవడంలో భారతీయులకు మించిన వారు లేరన్నారు. గతంలో మన నిపుణులు సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాలకు వెళ్లడం ‘మేధో వలస’గా భావించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని ఆయన విశ్లేషించారు. నిపుణులు, వనరులు ఉన్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే రోజులు వచ్చాయని, త్వరలోనే ‘రివర్స్ మైగ్రేషన్’ (తిరుగు వలస) ప్రారంభమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

నవ్యాంధ్రను డేటా సెంటర్ల హబ్‌గా మార్చేందుకు గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. భారత్ ప్రస్తుతం సింగిల్ గ్రిడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధిస్తోందని, భవిష్యత్తులో దేశం విద్యుత్తును ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఏఐ (AI) , క్వాంటం ఏఐ ఆల్గారిథమ్స్ రంగాల్లో యువతకు అపారమైన అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి నిదర్శనంగా ఇటీవల శిక్షణ కోసం పిలుపునిస్తే 50 వేల మంది యువత రిజిస్టర్ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు.

దేశం ఎదుర్కోబోతున్న ‘ఏజింగ్’ (వృద్ధాప్య జనాభా) సమస్యపై చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను, ఇప్పుడు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించి ‘జనాభా నిర్వహణ’ (Population Management) గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఏపీలో ఫెర్టిలిటీ రేటును 1.5 నుండి 2.1కు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు:

మూడో బిడ్డ పుడితే రూ. 25 వేల ఆర్థిక సాయంతో పాటు, ప్రతి నెలా రూ. 1,000 అందించాలని నిర్ణయించాం. తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా చైల్డ్ కేర్ లీవ్ వంటి సౌకర్యాలపై ఆలోచన చేస్తున్నాం. గతంలో భారతదేశంలో ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దేశానికి పెద్ద ఆస్తి అని, ప్రస్తుతం మైక్రో ఫ్యామిలీల వల్ల వస్తున్న మార్పులపై ప్రజల దృక్పథం మారాలని ఆయన పిలుపునిచ్చారు.

Rajamouli: హాలీవుడ్ రేంజ్‌లో ‘వారణాసి’ మేనియా.. జక్కన్న బ్రాండ్ వాల్యూకు ఎగబడుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్!

Exit mobile version