ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మంగళవారం నాడు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులుహైదరాబాద్లో అరెస్ట్ చేసి అనంతరం చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. అయితే పోలీసులు మోపిన అభియోగాన్ని మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. నారాయణ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది.
2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు లాయర్లు నిరూపించారు. దీంతో నారాయణకు వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరు చేసిన అనంతరం మాజీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నానని.. కానీ తాను నారాయణ సంస్థల అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని ఆరోపించారు. పేపర్ లీక్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామన్నారు. తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన కోర్టు బెయిలు మంజూరు చేసినట్టు నారాయణ పేర్కొన్నారు.