సండే వచ్చిందంటే చాలు చికెన్ ప్రియులకు ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కొందరైతే ప్రతిరోజు తినడానికి కూడా వెనకాడరు. చికెన్ తో వెరైటీ రెసిపీలు చేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కొండెక్కిన చికెన్ ధరలు నేల చూపుస్తున్నాయి. ఉన్నట్టుండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్ కిలో రూ. 30 కే వచ్చేస్తోంది. ఇది తెలిసిన చికెన్ లవర్స్ ఎగిరి గంతులేస్తున్నారు. అయితే చికెన్ ధరలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే బర్డ్ ఫ్లూ ప్రభావం. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది.
దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. అయినా కూడా చికెన్ కొనడానికి.. తినడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది. బర్డ్ ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు పలువురు. కొనుగోళ్లు తగ్గడంతో చికెన్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్ లకు పంపిచగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. బర్డ్ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించడం, లేదా మానేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
కోళ్లకు సోకుతున్న HPAI వైరస్ పట్ల కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అనారోగ్యంతో, వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని సూచనలు చేస్తున్నారు. వైరస్ సోకిన కోళ్ల తరలింపులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.