ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు.. ద్రవిడ వర్శిటీ భూముల్లో అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. అక్రమ మైనింగ్ కు ద్రవిడ యూనివర్సిటీ హబ్ గా మారిందని.. యూనివర్సిటీకి చెందిన 1100 ఎకరాల్లో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారని.. ఇష్టానుసారంగా చేస్తున్న గ్రానైట్ బ్లాస్టింగ్, అక్రమ రవాణ కారణంగా వన్యప్రాణులు చనిపోతున్నాయని.. జాతీయ పక్షి నెమళ్లతో పాటు అరుదైన జంతుజాలం నశిస్తోందని.. వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తూ అక్రమ మైనింగ్ కు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
Read Also: YSR Kapu Nestham: కాపులకు సీఎం జగన్ గుడ్న్యూస్.. రేపే నిధులు విడుదల..
ఇక, ద్రవిడ యూనివర్సిటీలో విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించిందని గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. ఇటీవలే వందల మంది అస్వస్థతకు గురయ్యారని.. యూనివర్సిటీలో కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేదన్నారు.. యూనివర్సిటీ ఉద్యోగులకు రెండేళ్ల నుంచి అలవెన్సులు కూడా ఇవ్వడం లేదనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజురోజుకు యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుంది.పేద విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా ద్రవిడ యూనివర్శిటీ పరిశోధన వాతావరణం ప్రమాదంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలో అక్రమ మైనింగ్ ను అడ్డుకుని పర్యావరణం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు.