తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం కొత్తగా సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) లైసెన్సుకు రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దీంతో టీటీడీ దరఖాస్తును కేంద్రం తిరస్కరించింది. ఈ కారణంగా టీటీడీకి వచ్చే విరాళాలు భారీ మొత్తంలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో 2020-21 ఏడాదిలో టీటీడీకి విదేశీ విరాళాల రూపంలో ఒక్క రూపాయి కూడా అందలేదు.
Read Also: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు… మరణాలు
స్వచ్ఛంద, మతపరమైన సంస్థలు విదేశీ విరాళాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఎఫ్సీఆర్ఏ లైసెన్సును తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. 2020 డిసెంబర్ నాటికి టీటీడీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ముగిసింది. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో టీటీడీకి వచ్చే విదేశీ విరాళాలకు బ్రేక్ పడింది. మరి విదేశీ విరాళాల సేకరణలో టీటీడీ భవిష్యత్లో ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి. కాగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద లైసెన్స్ రెన్యువల్కు దేశవ్యాప్తంగా మొత్తం 12,989 సంస్థలు దరఖాస్తు చేసుకోగా.. 5,789 సంస్థలు దరఖాస్తు చేయలేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.