రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం అనేక నిబంధనలు అమలులోకి తెచ్చింది. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ కనిపించేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిప్తారు. వారికి చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదంటోంది కేంద్రం. అయితే అందుకు కొన్ని షరతులు పెట్టింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. మొబైల్ను నేరుగా చేతితో పట్టుకోకుండా ఇయర్ఫోన్స్ ద్వారా ఫోన్ మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణించకూడదని ఆయన అన్నారు. లోక్సభలో మాట్లాడుతూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వైరల్ అవుతున్నాయి.
‘‘ఇకపై కారు నడిపే డ్రైవర్ హ్యాండ్ ఫ్రీ డివైజ్లను (బ్లూటూత్, ఇయర్ఫోన్స్) ఉపయోగించి ఫోన్లో మాట్లాడితే అప్పుడు దాన్ని నేరంగా పరిగణించలేం. అయితే అప్పుడు ఫోన్ కార్లో పెట్టకుండా డ్రైవర్ జేబులో పెట్టుకోవాలి. దీనికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా జరిమానా విధిస్తే.. దాన్ని కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది’’ అని గడ్కరీ తెలిపారు.
అయితే మొబైల్ నేరుగా చేతిలో పట్టుకుని ఫోన్ మాట్లాడితే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయొచ్చని కేంద్రమంత్రి అన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే వార్తే అయినప్పటికీ.. కొందరు దీన్ని అలుసుగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదంటున్నారు పోలీస్ అధికారులు. ఫోన్ మాట్లాడుతున్నామని చెబుతూనే.. చెవిలో బ్లూటూత్ వంటివి పెట్టుకుని పాటలు వింటూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ప్రమాదం బారిన పడే అవకాశముంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం దుర్వినియోగం కాకుండా చూడాలి.