టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేక టీడీపీ నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని ఆరోపించారు. ఆ ఓర్వలేనితనంతోనే అయ్యన్న ఇంటి గోడను కూల్చారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాల్చి చంపుతానని జగన్ ఆనాడు కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుట్కా గాడు, కొబ్బరి చిప్పలగాడు మాట్లాడిన మాటలు సంగతేంటీ..? అంటూ ప్రశ్నించారు.
కొబ్బరి చిప్పల నాయకుడు వెలంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడ్ని అరెస్ట్ చేయిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నిప్పలు చెరిగారు. ఎన్ని రకాలుగా మమ్మల్ని అణిచేసే ప్రయత్నం చేసినా మేం తగ్గేది లేదని అన్నారు. రేపట్నుంచి ఇంతకు పదింతలు మాట్లాడతామంటూ పేర్కొన్నారు బోండా ఉమ. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు.. ఇది అధికార దుర్వినియోగం కాదా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలకు అధికారులు సహకరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చిరించారు బొండా ఉమ.
అయితే నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్దకు ఈరోజు తెల్లవారుజామున పెద్దయెత్తున పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వచ్చారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను కూల్చారు. పంట కాల్వను ఆక్రమించి అయ్యన్నపాత్రుడు గోడ నిర్మించారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన రెండు సెంట్ల భూమిని ఆక్రమించి అయ్యన్న గోడ కట్టారని, వాటిని తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.