మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్బాబు తిరిగి టీడీపీ గూటికి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరులో మంగళవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రావెల కిషోర్బాబు కలిసి మంతనాలు జరిపారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి రావెల ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత రావెల జనసేనకు గుడ్బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆయన మళ్లీ టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబును రావెల కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
కాగా గతంలో రావెల కిషోర్ బాబు ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవడంతో అనూహ్యంగా మంత్రి పదవి కూడా దక్కింది. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వరుస వివాదాల కారణంగా 2018లో కేబినెట్ విస్తరణలో ఆయన మంత్రి పదవి పోయింది. దీంతో అసంతృప్తి చెందిన ఆయన.. టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన సంగతి తెలిసిందే.