ప్రశ్నిస్తే కేసులా..?.. అఖిలప్రియ ఫైర్

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.. ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారన్న ఆమె.. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు పర్మిషన్ తీసుకొని… మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారని.. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేసి మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, మట్టి మాఫియా నుంచి స్థానిక ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు భూమా అఖిలప్రియ… అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకొని అధికారులకు అప్పగిస్తే సీజ్ చేశారు… కానీ, ఉదయం ఆ వాహనాలు వైసీపీ నాయకుడి ఇంట్లో ఉన్నాయన్న ఆమె.. వారం రోజుల్లో అధికారులు ఎర్రమట్టి దాందాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.. లేకపోతే రైతులతో కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు మాజీమంత్రి భూమా అఖిల ప్రియ.