ఏపీలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్ష ఎంత గందరగోళాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాలు లీక్ కావడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎట్టకేలకు నిర్వఘ్నంగా ముగిసిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. కరోనా కారణంగా రాష్ట్రంలో రెండేళ్లపాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించని సంగతి తెలిసిందే.
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్ని ఎత్తవేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా మార్కులనే వెల్లడిస్తామని బి.రాజశేఖర్ తెలిపారు. విద్యాశాఖ కూడా ఎలాంటి ర్యాంకులను ప్రకటించదని, ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు కనుక ర్యాంకులు ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ప్రభుత్వం. తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఫలానా ర్యాంకులు తెచ్చుకున్నారని ప్రచారం చేయడం నేరమని, అలా చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది విద్యాశాఖ.