పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల ధరలు పెంచొద్దు అంటే చంద్రబాబుకు ఏం నొప్పి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మేలును చెప్పుకుంటూ.. గర్వంగా తాము ఓటు అడుగుతున్నామన్న ఆయన.. కానీ, టీడీపీ ఏమీ చెప్పుకొని ఓటు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఈ ఎన్నికలు మా అభివృద్ధి, సంక్షేమానికి రెఫరెండంగా భావిస్తూ..ప్రజల్లోకి వచ్చాం.. మా మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన రాజీనామాల సవాల్ ని స్వీకరించే దమ్ము మీకు ఉందా? అని ప్రశ్నించారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచార సభ విరమించుకుంటే దానిపై కూడా రాజీనామా? అని మండిపడ్డారు మంత్రి అనిల్.. మరి పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా వస్తే.. పవన్ ఇంట్లో పడుకుంటే.. టీడీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.. మరోవైపు.. వకీల్ సాబ్ సినిమా టికెట్ల వ్యవహారంపై స్పందించిన మంత్రి అనిల్.. పవన్ సినిమా టికెట్ల ధరల పెంచొద్దు అంటే.. చంద్రబాబు ఏం నొప్పి అంటూ ఫైర్ అయ్యారు.. బ్లాక్ మార్కెట్ ని మేం ప్రోత్సహించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, వకీల్ సాబ్ ని చూసి సీఎం జగన్ బయపడ్డాడని అంటారా.?… ఏ సాబ్ వచ్చినా మా లీడర్ వణకడు.. ఆయన చాలా మందిని చూశారని చెప్పుకొచ్చారు.. ఈ నెల 17వ తేదీ తర్వాత మీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరిన మంత్రి అనిల్.. ఆ ఏడుకొండల వెంకన్న ఆశీసులు ఎవరికున్నాయో 17 తర్వాత తేలిపోతుందన్నారు. మీ మీద మీకు నమ్మకం వుంటే… మీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు అందరూ రాజీనామా చేసి రండి.. ప్రజల్లో ఎవరి దమ్ము ఏంటో తేలిపోతుంది… ఆ దమ్ము మీకుందా…? సవాల్ చేశారు.. ఇక, తప్పుడు ప్రచారాలు చేస్తే… కేసులు తప్పవు అని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్.