వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ శుక్రవారం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే కాగా… బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.. విచారణ ప్రారంభమైన వెంటనే సీఐడీ జిల్లా కోర్టుకు కాకుండా నేరుగా ఎందుకొచ్చారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని సరైన కారణాలు లేకుండా అరెస్టు చేసి రిమాండుకు పంపాలని పిటిషనర్ తరపు న్యాయవాది తెలియజేశారు. ప్రాథమిక విచారణగాని, కనీస ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని రాజు తరఫు లాయర్ వాదించారు. అయితే, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అందుకే అరెస్టు తప్పలేదని ప్రభుత్వం వాదనలు వినిపించింది… దీంతో.. ఆయన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు.. సెషన్ కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించింది. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలన్న హైకోర్టు… ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో.. సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రఘురామకృష్ణంరాజు న్యాయవాదులు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు..
MP Raghu Rama