NTV Telugu Site icon

ఆనంద‌య్య మందు పంపిణీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌

Anandaiah

ఆనందయ్య మందు పంపిణీపై విచార‌ణ‌ను మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు.. ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను ఈ సంద‌ర్భంగా కోర్టు తోసిపుచ్చింది.. ఈ వ్య‌వ‌హారంపై మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విచారణ చేప‌ట్ట‌నుంది హైకోర్టు.. అయితే, ఆనందయ్య మందుపై ప్ర‌భుత్వం కాసేప‌ట్లో స‌మీక్ష జరుపుతోందని కోర్టుకి తెలిపారు ప్ర‌భుత్వ న్యాయవాది.. దీంతో.. ప్రభుత్వ స‌మీక్ష నిర్ణయం తెలపాలని.. మధ్యాహ్నం తీర్పు వెల్ల‌డిస్తామ‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.. దీంతో.. విచార‌ణ‌ను వాయిదా వేసింది.

మ‌రోవైపు.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేద‌ని వాదించారు ఆనందయ్య తరపున న్యాయవాది అశ్వని కుమార్.. ఫార్మా కంపెనీల‌ ఒత్తిడి వల్ల మందు పంపిణీని అడ్డుకుంటున్నారన్న ఆయ‌న‌.. చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేద‌న్నారు.. రాజ్యాంగం ప్రకారం ఈ మందు పంపిణీ చేసే హక్కు ఉందన్న ఆనందయ్య న్యాయవాది… వంశపారపర్యం నుంచి ఇది చేస్తున్నార‌ని హైకోర్టుకు తెలిపారు. మ‌రోవైపు.. ఆనందయ్య మందు వేసుకున్న‌వారిలో 130 మంది పేషేంట్స్ నెల్లూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరార‌ని ప్ర‌భుత్వం తెలిపింది.. ఆయుష్ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదని తెలిపారు ప్రభుత్వ న్యాయవాది.. అయితే, బలవంతంగా పేషేంట్స్ ని అక్కడకు చేర్చార‌ని.. కేసు నమోదు చేసారా? అని ఆనందయ్య త‌ర‌పు న్యాయ‌వాది ప్ర‌శ్నించారు. ఇక‌, మ‌ధ్యాహ్నం విచార‌ణ ఎలా సాగుతోంది.. హైకోర్టు తీర్పు ఎలా ఉండ‌బోతోంది? అనే ఉత్కంఠ మాత్రం నెల‌కొంది.