ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగా ఖర్చుపెడుతుంది. దేశంలో ఆరు ప్రధాన రాష్ట్రాల కు సమానంగా ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తోంది. 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ 37,458 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది 33,102 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చుపెడుతోందని ఓ నివేదికలో తేలింది.ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఇచ్చిన నివేదిక తెలిపింది.
మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండగా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా 36శాతం ఉంది.పీఆర్సీని అమలు చేస్తే 10వేల కోట్లకు పైగా భారం పడనుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల రూపంలో 68,340 కోట్లు ఉద్యోగులకు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా బడ్జట్ లెక్క ప్రకారం నిరర్థక ఖర్చు కింద చూపిస్తారు. ఏ మాత్రం తిరిగిరాని ఖర్చుల కింద 68 వేల కోట్లను ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
పీఆర్సీ విషయంలో ఉద్యోగ నేతల డిమాండ్ కి ప్రభుత్వం తలవొగ్గింది. లేదంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. కొత్తగా పీఆర్సీ అమలు చేస్తే మరో 10వేల కోట్ల ఖర్చు కలుస్తుందని భావిస్తున్నారు. అన్నీ కలుపుకుంటే 78వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కింద ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాలకు కూడా ప్రభుత్వం అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.దేశంలో హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఖర్చు ఎక్కువగా వుందని ఓ సర్వేలో తేలింది.
11వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2018-19లో జీతాలు, పెన్షన్ల కోసం రూ.52,513 కోట్లు ఖర్చు చేశారని సీఎం జగన్ కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. తాజాగా 2020-21 నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.67,340 కోట్లకు చేరిందని వివరించారు. ఎస్ ఓ ఆర్ లో నమోదు చేసిన వివరాల ప్రకారం 2018-19లో జీతాలు 84 శాతం ఉంది. గత ఆర్థిక ఏడాది 2020-21లో జీతాలు, పెన్షన్లు ఎస్ఓఆర్ లో 111 శాతానికి చేరింది.