NTV Telugu Site icon

AP Pensions: ఏపీలో పింఛన్ల పండుగ.. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి సర్వం సిద్దం

Ap Pensions

Ap Pensions

AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది.‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఇకపై ఇంటి వద్దనే సామాజిక పింఛన్ల పంపిణీ చేయనున్నారు.
స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు సీఎం పింఛను ఇవ్వనున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేయనుంది ఏపీ ప్రభుత్వం. పింఛను పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పింఛను పెంపును సీఎం చంద్రబాబు వర్తింపజేశారు. పెరిగిన పింఛను రూ.4000, గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి రూ.7000 ప్రభుత్వం ఇవ్వనుంది.

Read Also: Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ

• వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పింఛను
• దివ్యాంగులకు రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 చేసిన కూటమి ప్రభుత్వం
• తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000 చేస్తూ నిర్ణయం.
• ఈ విభాగంలో పింఛను పొందే వారి సంఖ్య 24318 మంది.
• పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు ఖర్చు
• పింఛన్ల కోసం రూ.4,408 కోట్లు ఒక్క రోజులో పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
• గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు ఖర్చు.
• గత ప్రభుత్వంలో పింఛను కోసం కేవలం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు.
* దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమానికి సమాయత్తం
• ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం