NTV Telugu Site icon

గుడ్‌న్యూస్‌.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు

AP Govt

డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. టీడీపీ హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.. డీఎస్సీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంద‌న్న ఆయ‌న‌.. అభ్యర్థుల భవితవ్యంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్ధులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్ల‌డించారు.. త్వరలోనే డీఎస్సీ అభ్యర్ధులకు పోస్టింగ్‌లు ఇస్తామని.. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో విడుదల చేయ‌నున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఇక‌, ఈ నిర్ణయం వల్ల ఏటా 60 నుంచి 70 కోట్ల అదనపు భారం ప్ర‌భుత్వంపై ప‌డుతుంద‌ని.. అయినా వారికి న్యాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు.. 1998 అభ్యర్థులకు కూడా గత ప్రభుత్వం హామీ ఇచ్చి తప్పించుకుంద‌ని.. 36 మంది ఉన్నారు..వారి సమస్యను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిపారు మంత్రి ఆదిమూల‌పు సురేష్.

మ‌రోవైపు సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు బీఈడీ అసోసియేషన్ ప్ర‌తినిధులు.. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద మనసు చేసుకోలేదు.. గతంలో ఉన్న వారు హామీ ఇచ్చి మోసపుచ్చారు.. ఈ రోజు మాకు పండుగ రోజు… సీఎం జ‌గ‌న్.. మా జీవితాల్లో వెలుగులు నింపార‌న్నారు బీఈడీ అసోసియేష‌న్ ప్ర‌తినిది వెలుగు జ్యోతి.. పాదయాత్రలో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేశార‌ని.. మేం ఉద్యమాలు చేస్తే మాయ మాటలు చెప్పి మాన్పించారు.. కానీ, మాట ఇచ్చిన నిలుపుకున్న సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు 2190 కుటుంబాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయ‌న్నారు.