ఏపీలో సినిమా టిక్కెట్లకు సంబంధించి జగన్ సర్కారు మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచిన ప్రభుత్వం త్వరలోనే ఆన్లైన్లో టిక్కెట్లను విక్రయించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ టిక్కెట్ల వెబ్సైట్ నిర్వహణ టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ బిడ్డింగ్లో రెండు సంస్థలు పాల్గొనగా జస్ట్ టిక్కెట్స్ సంస్థకు టెండర్ దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంటే ఇకపై ప్రేక్షకులు సినిమా చూడాలంటే ఎఫ్డీసీ పోర్టల్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆన్లైన్ టిక్కెట్ల వెబ్సైట్ వచ్చే నెల రెండో వారం లేదా మూడో వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని అన్ని థియేటర్ల నుంచి టిక్కెట్లను ఒకే సంస్థ ద్వారా విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రైవేట్ సంస్థల కంటే ఆన్లైన్లో తక్కువ రేటుకే ప్రభుత్వం టిక్కెట్లను విక్రయించనుంది. దీంతో ప్రేక్షకులపై ఆన్లైన్ ఛార్జీల భారం అధికంగా లేకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ చర్యతో బ్లాక్ టిక్కెట్ల దందాకు చెక్ పెట్టాలని జగన్ సర్కారు యోచిస్తోంది.