ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా పీఆర్సీపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దీనిలో భాగంగా పలు మార్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేవాలు నిర్వహించారు.. తాజాగా, బుధవారం రోజు కూడా భేటీ జరిగింది.. అయితే, ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు.. ఈ సమావేశంలో పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్రెడ్డి ఆయా సంఘాలకు సమాచారం ఇచ్చారు.
Read Also: కోవిడ్ కలకలం.. మరో 30మంది వైద్యులకు పాజిటివ్
మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సమావేశం కాబోతున్నారు సీఎం జగన్.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న 15 సంఘాల నాయకులకు అందుబాటులో ఉండాల్సిందిగా సమాచారం ఇప్పటికే వెళ్లగా.. ఉద్యోగ సంఘాలతో సమావేశం కంటే ముందు ఆర్ధిక శాఖ అధికారులతో మరోసారి సమావేశం కాబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వం నుంచి అధికారిక పిలుపు కోసం ఉద్యోగ సంఘాల నాయకులు నిరీక్షిస్తున్నారు.. ఒక్కో సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులకు సీఎం భేటీకి అవకాశం కల్పించనున్నట్టుగా తెలుస్తోంది.