నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్డేట్స్ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ పరికరాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చి, ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు చేయాలనీ అన్నారు. నిర్వహణ వ్యయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చూసుకుంటుంది. రాబోయే రోజుల్లో అప్గ్రేడ్తో, ఎప్పటికీ పనిచేసేలా ఈపరికరాలు ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తునాం అన్నారు.
ఆస్పత్రులను జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. శ్రీకాకుళం, ఒంగోల, నెల్లూరు, కడపల్లో కొత్తగా సీటీ, ఎంఆర్ఐ పరికరాలు. ఈ పరికరాలకు 3 సంవత్సరాల వారెంటీ ఉంటుంది, మరో 7 ఏళ్లపాటు నిర్వహణను కంపెనీలు నిర్వహిస్తాయి. మిగిలిన 7 బోధనాసుపత్రుల్లో ఉన్న పరికరాల అప్డేషన్, కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా వీటిని నిర్వహిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా మరో అడుగు, అలాగే నాడు – నేడు ద్వారా మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, ఆశ వర్కర్లు, వాలంటీర్లు కోవిడ్ సమయంలో కష్ట పడుతున్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నా… ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. వీరి సేవలగురించి ఎంత పొగిడినా తక్కువే. అందరి ప్రశంసలు మీకు ఉంటాయి అని జగన్ తెలిపారు.
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డీఎంఅండ్హెచ్ఓలకు కొన్ని సూచనలు చేయదలిచాను. ఫీవర్ సర్వే సరిగ్గా చేయలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటన్నారన్న వార్తలు చూశాను. ప్రస్తుత మహమ్మారి ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడిలో ఉన్నారని గుర్తించాలి. మంచిగా వారిచేత పనిచేయించుకోవాలని అధికారులను కోరుతున్నా. నా దగ్గరనుంచి పారిశుద్ధ్య కార్మికుడు వరకూ ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ వల్ల వచ్చే అనూహ్య పరిస్థితులును ఎదుర్కోనే ఒత్తిడిలో ఉన్నారు. రోజుకు 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మన దగ్గర మహానగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాలు లేకపోయినా సరే.. మన రాష్ట్రంలో మరణాల రేటు దేశంలోని అన్నిరాష్ట్రాలతో పోలిస్తే.. తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. ఉద్యోగులంతా బాధ్యతలను చిరునవ్వుతో తీసుకుంటున్నారు కాబట్టి, ఎంత ఒత్తిడి ఉన్నా సరే పనిచేస్తున్నారు సాధ్యం అయ్యింది. ఎవ్వరూ కూడా సహనం కోల్పోవద్దు అని పేర్కొన్నారు.