ఓటీఎస్ పథకంపై ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. రూ.20వేలు కట్టి ఓటీఎస్ తీసుకోవటం ద్వారా ఎటువంటి లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్ లబ్దిదారులకు వస్తుందని పేర్కొన్నారు. ఆ కాగితాలను బ్యాంకులో పెట్టి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీని వల్ల లబ్దిదారులు మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఉచిత రిజిస్ట్రేన్, ఉచిత స్టాంప్ డ్యూటీ వల్ల రూ.1600 కోట్ల మేర పేద వర్గాలకు లాభం చేకూరిందని తెలిపారు. రుణమాఫీ ద్వారా మరో రూ.10వేల కోట్ల లబ్ధి జరిగిందని ఆయన స్పష్టం చేశారు.