ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సరైన ఫార్మాట్లో లేని వాటిని తిరస్కరించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరుతో పాటు కొన్నిచోట్ల నామినేషన్ల తిరస్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 9వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
నవంబర్ 14న గ్రామ పంచాయతీల, మున్సిపాలిటీలకు.. నెల్లూరు కార్పొరేషన్కు నవంబర్ 15న.. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్పైనే అందరి దృష్టి నెలకొంది. నెల్లూరు కార్పొరేషన్, కుప్పం మున్సిపాలిటీలోని అన్ని స్థానాలను దక్కించుకుంటామనే ధీమాలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.మరోవైపు నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. కీలకమైన స్థానాల్లో ముఖ్య నేతలంతా మకాం వేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని.. తమకు అనుకూలంగా ఉన్నవారినే ఆర్వోలుగా పెట్టుకుంటోందని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.