తీరం దాటిన మాండూస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఇక, తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం, ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.. తిరుపతి పట్టణంలో వర్షపు నీరు త్వరిత గతిన దిగువకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్ను ఆదేశించారు సీఎస్ జవహర్రెడ్డి.
Read Also: Big Twist in Vaishali Case: వైశాలి కేసులో బిగ్ ట్విస్ట్.. మాకు ఏడాది క్రితమే పెళ్లైందంటున్న నవీన్
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.పూనం మాలకొండయ్య మాట్లాడుతూ భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాలు చేపట్టాలని సూచించారు.. ఇక, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సంచాలకులు డా.బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 8.30 గంటల నుండి శనివారం ఉ.8.30 గంటల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని సీఎక్కు వివరించారు. కాగా, గత 24 గంటల్లో పై తెలిపిన ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.. టెలీకాన్ఫరెన్స్ లో పొల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జిల్లాలో 2 గేదెలు, 2 గొర్రెలు చనిపోగా రెండు తాటాకు ఇళ్ళు దెబ్బతిన్నాయని వివరించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒక గృహం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఇంకా ఈటెలీ కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.