Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లాలో మహేశ్వర్ రెడ్డి మృతి కేసు రాజకీయంగా మరింత హీట్ పెంచుతుంది.. ఈ కేసులో తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం కోర్టు వద్దకు చేరుకున్న ఆయన, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోంది” అంటూ ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తనకు ఎందుకు గన్మెన్ను తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహేశ్వర్ రెడ్డి మృతి ఘటనను మొదట పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారని.. కానీ, సంవత్సరం తర్వాత ఇప్పుడు కుట్రపూరితంగా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. “చనిపోయిన వ్యక్తి మా బంధువే. అతను కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మేమే కాపాడాం.. ఇప్పుడు మాపైనే కేసులు పెట్టడం ఎక్కడి న్యాయం?” అని ప్రశ్నించారు ప్రకాష్ రెడ్డి.. తమ అనుచరులను తమపైనే రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. “ప్రకాష్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించాలనే కుట్ర జరుగుతోంది” అంటూ ఆరోపించారు.. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలపై కూడా ఆయన స్పందించారు. “హనీ ట్రాప్ వ్యవహారంపై మేము మాట్లాడకూడదా? పాపంపేట భూకబ్జాలపై ప్రశ్నించకూడదా? మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్నారు” అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న అధికారులపై తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి..
కాగా, అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరి 25న తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు సోమలదొడ్డి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే తన కుమారుడి మృతికి వైసీపీ నేతలే కారణమని మృతుడి తండ్రి మల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇక, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆడియో, వీడియో రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా అరెస్టులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సాక్ష్యాధారాలతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించారు.
