TDP MLA Bandaru Sravani: అనంతపురం జిల్లాలోని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందది.. నిన్న ఉదయం కారులో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. నిమ్మకాయలు, తెల్ల నువ్వులను ఎమ్మెల్యే ఇంటి వద్ద విసిరారు. అయితే, ఈ దృశ్యాలను గమనించిన ఎమెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నంబర్ ను గమనించి ఆ కారు ని వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే, ఆ కారు అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుంది.. ఇక, కారు నంబర్ ఆధారంగా వివరాలపై ఆరా తీయగా.. గుంటూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారుగా గుర్తించారు.. కానీ, కారు యజమానులు ఈ కారు అప్పటికే వేరే వ్యక్తికి అమ్మినట్టు వెల్లడించారు..
Read Also: T20 World Cup: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ మాజీ కెప్టెన్!
మరోవైపు, ఈ ఘటనపై అలర్ట్ అయిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు.. క్షుద్ర పూజలో ఉపయోగించిన నిమ్మకాయలు, నువ్వులను కాల్చివేశారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఇది ఎవరి పని? ఎమ్మెల్యే అంటే గిట్టనివారే ఈ పని చేశారా? లేక రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది..
