Kethireddy Venkatarami Reddy: తెలుగు సెలబ్రిటీల మౌనంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, ప్రముఖుల స్పందనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్కు గతంలో తన తల్లి, కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించలేదని, అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విద్యార్థులు విమర్శించారనే అంశంపై స్పందించారని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు..
ఢిల్లీలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తప్పుబట్టారని, ధైర్యంగా ముందుకొచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడించారని ఆయన అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు ఒక్కరు కూడా స్పందించలేదని దుయ్యబట్టారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలు దూరమవుతాయనే భయమా? లేక ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తుల భయమా? అని ప్రశ్నించారు కేతిరెడ్డి… అలాంటి భయాలతో మౌనం పాటిస్తే సెలబ్రిటీలు అనే గుర్తింపుకు అర్థమేంటని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి..

