Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పంచదార్ల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకే తాము పంచధారలకు వచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వాములుగా మారి దోపిడీకి పాల్పడుతున్నారని బొత్స ఆరోపించారు. సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడే నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా గమనించాలని సూచించారు. “కళ్లుంటే వచ్చి ఇక్కడ పరిస్థితులు చూడండి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
స్థానిక ఎమ్మెల్యే కుట్రలు జరుగుతున్నాయని చెబుతున్నారని, నిజంగానే కుట్రలు జరుగుతున్నట్లయితే ప్రభుత్వం వాటిని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు బొత్స.. ప్రభుత్వం చేతకానిదా? లేక చేతనైనా చర్యలు తీసుకోవడం లేదా? అని నిలదీశారు. “దొంగలు… దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారు” అంటూ కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఆర్సీలో మైనింగ్ అనుమతులపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెబుతున్నారని, ఇంతకాలం ఆ అంశం ప్రభుత్వ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. ధర్మలింగేశ్వరస్వామి పేరుతో రాజకీయాలు చేయవద్దని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, మతపరమైన అంశాలను రాజకీయాలకు వాడుకోవద్దని ఆయన సూచించారు బొత్స సత్యనారాయణ..

