Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు

  • కూటమి ప్రభుత్వంపై అంబటి ఫైర్
  • ‘చంద్రబాబువి గారడీ విద్యలు’ అంటూ విమర్శలు
  • పథకాలు , ప్రాజెక్టులపై వైసీపీ ఆరోపణలు
  • పోలీసుల దుర్వినియోగం జరుగుతోందన్న అంబటి
Ambati

Ambati

Ambati Rambabu : ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోందని, ప్రజలకు ఉపయోగపడే పనులు మానేసి కేవలం ఆర్భాటాలకు, ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన పాలన అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి సింగపూర్ కలర్ పూసే ప్రయత్నం చేస్తున్నారని, అసత్యాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం రద్దు చేసిందని అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని, హాస్టల్ విద్యార్థులకు సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో, చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతీసారి ఎన్నికల ముందు మానిఫెస్టో ఇచ్చి, ఆ తర్వాత మోసం చేసి దానిని పక్కన పడేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. “ఈ రెండేళ్లలో పేదలకు ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చారా?” అని ఆయన ప్రశ్నించారు.

నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అంబటి తీవ్రంగా తప్పుబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా ప్రభుత్వం సరిగ్గా వాడలేదని ఆరోపించారు. మంత్రి రామానాయుడు తీరుపై స్పందిస్తూ.. వెలిగొండ ప్రాజెక్టు దగ్గర తట్టా, బుట్టా నెత్తిమీద పెట్టుకుని ఆయన చేస్తున్న పనులు కేవలం ఓవర్ యాక్షన్ , డ్రామాలని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కూలీని అని చెప్పుకుంటూ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం మానేసి, పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్‌గా ఇచ్చేశారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో నేరాలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, కేవలం రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని అంబటి ఆరోపించారు. పోలీస్ యంత్రాంగాన్ని వైసీపీ నేతలను అరెస్ట్ చేయడానికి, సోషల్ మీడియా కేసుల పేరుతో వేధించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్స్‌ను కంట్రోల్ చేసినట్లుగా రాజకీయ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని, అయితే ఇలాంటి కేసులకు ఎవరూ భయపడబోరని ఆయన స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారని పేర్కొంటూ, ప్రజలు ఈ దౌర్భాగ్య పాలనను గమనించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.